23, జులై 2011, శనివారం

నాగబు మెలికలు

మూడు అంచలుగా నిర్మించబడిన "అమరావతీ " బౌద్ధస్ధూపం యొక్క త్రవ్వకాలలో బయల్పడిన ఒక రాతిపలక మీద "నాగబు" అనే పదముందనీ, అదే శాసనాలలోకి ఎక్కిన మొదటి తెలుగు పదమనీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ప్రకటించిన విషయాన్ని "తెలుగు వాహిని" లో మన గురువు గారు శ్రీరామమూర్తి దగ్గుపాటి గారు ప్రస్తావించారు కదా! దీనిలో కొత్త మెలిక ఏమిటంటే, ప్రభాకర శాస్త్రి గారి ప్రకటనతో నేటి పురాతత్వ శాస్త్రవేత్తలు స్వల్పముగా విభేధిస్తున్నట్లు ఈ మధ్య కొన్ని సంబంధిత రచనలలో చదివాను. "దీనికి కారణం అమరావతి లో దొరికిన చాలా శాసనాలలో చాలా చోట్ల 'నాగబుధనిక', 'నాగబుద్ది' లాంటి పేర్లు కనిపిస్తాయని, 'నాగబు' అనే మాటతో దొరికింది ఒకే రాతి ఫలకంలోని ఒక ముక్కయని, 'నాగబుధనో', 'నాగబుధనికా', లేదా 'నాగబుద్ధీ' లాంటి మాట గల శాసన శిలాఫలకం పగిలిపోగా "నాగబు" అనే భాగం ఉన్న ముక్క మాత్రమే లభించి ఉండవచ్చునన్నది వారి పరిశోధనాసారం" అంటారు ఆచార్య వెలమ సిమ్మన్న. దీనిని ప్రొఫెసర్ పేర్వారం జగన్నాథం గారు కూడా బలపరిచారు. దీని మీద ప్రచురింప బడిన కొత్త పరిశోధనల వివరాలు ఎవరికైనా తెలిస్తే తప్పక క్రింద కామెంట్స్ లో తెలుపగలరు.

13, జులై 2011, బుధవారం

ఆంధ్రభోజులకు ఋణగ్రస్తులం

నాకూ ఈ మధ్యే తెలిసింది తెలుగు లో "పంచ కావ్యాలు" అని ఏవో ఉన్నాయనీ, సాహిత్య పరంగా విజ్ఞుల మెప్పు పొంది, తెలుగులో తలమానికంగా నిలిచిపోయాయనీ. ఇంతకీ ఆ అయిదు ప్రబంధాలు ఏమిటీ అని శోధిస్తే, అవి:

1) అల్లసాని పెద్దన వ్రాసిన "మను చరిత్ర"
2) తెనాలి రామకృష్ణ వ్రాసిన "పాండురంగ మహత్యం"
౩) శ్రీ కృష్ణ దేవ రాయుడు వ్రాసిన "ఆముక్తమాల్యద"
4) రామ రాజ భూషణుడు వ్రాసిన "వసు చరిత్ర"
5) చామకూర వెంకటకవి వ్రాసిన "విజయ విలాసము"

అని తెలిసింది.

ఇవన్నీ కూడా విజయ నగర సామ్రాజ్య సాంస్కృతిక విప్లవ వైభవానికి నిదర్శనాలు. తెలుగు జాతికి అపురూప నిధులు. వీటిలో "ఆముక్తమాల్యద" ఇదివరకు తెలుగు వాహిని లో మనం చదువుకున్నాము. ఆముక్తమాల్యద వ్రాసిన కృష్ణదేవరాయల (1514) గారి ఆస్థానం లో అల్లసాని పెద్దన మరియు తెనాలి రామకృష్ణలు కొలువు చేసిన విషయం మనందరికీ తెలిసినదే. కృష్ణదేవరాయలి తరువాత అచ్యుత దేవ రాయలు, తరువాత సదాశివ రాయలు, తరువాత ఆలియ రామ రాయలు పరిపాలించారు. (Note : ఆలియ అంటే అల్లుడు)

ఈ ఆలియ రామ రాయలి వద్ద కొలువు చేసినందుకు "భట్టు మూర్తి" అనే కవి గారికి "రామ రాజ భూషణుడు" అని బిరుదు వచ్చిందిట. 1565 లో తళ్లికోట యుద్ధంలో అహ్మద్నగర్, బీదర్, బీజాపూర్ మరియు గోల్కొండ నవాబుల కూటమి చేతిలో ఓడి, ప్రాణాలు కోల్పోయాడు రామరాయలు. అతని తమ్ముడు, కృష్ణదేవరాయలి మరో అల్లుడు అయిన తిరుమల దేవరాయలు, రాజకుటుంబం తో పాటు రాజపోషకులనీ, అపార విజయనగర సామ్రాజ్య ఖజానానీ కూడా సురక్షితంగా అనంతపురం జిల్లా "పెనుగొండ"కు తరలించాడు. అక్కడ మళ్ళీ సామ్రాజ్యాధిపతిగా వెలసి, పరిపాలించాడు. 1570 లో, ఈయన కొలువులో రామరాజ భూషణుడు "వసు చరిత్ర" అనే ప్రభంధాన్నిరచించాడు.

అయితే, విజయనగర రాజుల సేనా నాయకులందరూ మన తెలుగు "నాయకు" లే. నేటి తెలంగాణా ప్రాంతం ఢిల్లీ సుల్తానుల వశం అయ్యాక, ఓరుగల్లు సంస్థానం వదిలి విజయనగరం చేరిన వారు వీరు. మహా శౌర్య పరాక్రమాలే కాదు, కళాసక్తి కలవారు కూడా. వీరినే, విజయనగర రాజులు "మిలిటరీ గవర్నర్లు" గా తమ సామంతాలైన కేలడి, తంజావూరు, గింగీ, కాళహస్తి, చిత్రదుర్గ, బేళూరు, చెన్నపట్న, వెల్లూరు, రాయదుర్గ మరియు కాండ్య (Kandy , శ్రీలంక), దాదాపు దక్షిణ భారత దేశమంతా నియమించారు. వీరు తెలుగు వారు కావడం, తెలుగుకి వీరి ఆస్థానాలలో పెద్ద పీట వెయ్యడంతో, తెలుగు భాషా ప్రాభవం ఆంధ్రేతర దక్షిణ భారతదేశంలో బాగా విస్తరించింది. ఈ నాటికీ అందుకే తమిళనాడు, కర్ణాటకలలో ఎంతో మంది తెలుగు వారు కనపడతారు (including త్యాగరాజు, etc.). ఈ నాయక రాజులలో ఒకరైన తంజావూరుకు చెందిన రఘునాథ నాయకుని ఆస్థానం లో, 1600 -1635 మధ్య, "చామకూర వేంకట కవి" గారు "విజయ విలాసము" అనే ప్రబంధాన్ని వ్రాసారు.

ఈ విధంగా విజయనగర రాజుల కృషి చలవనే మనకు ఈ అయిదు ఆణిముత్యాల్లాంటి కావ్యాలు లభ్యమైనాయి అనడం లో అతిశయోక్తి లేదు. వారికి నా కృతజ్ఞతాపూర్వక నివాళులు.